11/04/2023
వేరుకాపురం అని వేధిస్తే.. భార్యకు విడాకులు ఇవ్వొచ్చు!
తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక
భర్తకు ఆ హక్కు ఉంటుంది.. కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ
తల్లిదండ్రులను చూడడం కొడుకు బాధ్యత అని స్పష్టం
కోల్కతా, ఏప్రిల్ 10: తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’’ అని జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ ఉదయ్కుమార్ల ధర్మాసనం పేర్కొంది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు మార్చి 31న ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ మిడ్నాపూర్కు చెందిన ప్రశాంత్కుమార్ మండల్కు 2001లో ఝార్నాతో వివాహమైంది. ప్రశాంత్ స్కూళ్లలో పార్ట్టైం టీచర్గా, పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి పనులతో కొంత సంపాదించేవాడు. అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఆ ఆదాయం సరిపోయేది కాదు. దీంతో, ఆమె వేరు కాపురం ఉందామని ప్రశాంత్ను వేధించింది. ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసుతో ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ మిడ్నాపూర్లోని ఫ్యామిలీ కోర్టులో ప్రశాంత్ విడాకుల కేసు దాఖలు చేయగా.. 2009లో విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.