23/01/2025
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి( 1915 - 1967)
( నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ప్రజా సేవ కోసం....
ప్రజల సంక్షేమం కోసం...
ప్రజోద్యమాల కోసం....
జీవితాన్ని త్యాగం చేసిన చరితార్థుడు
అతడు ~
డా. రామ్ గా ప్రసిద్ధి చెందిన
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి...
వీరి పూర్తి పేరు ~
పుచ్చలపల్లి వెంకట రామచంద్రారెడ్డి...
▪️వివరాల్లోకి వెళ్తే....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామానికి చెందిన పుచ్చలపల్లి వెంకటరామిరెడ్డి ~ శేషమ్మ దంపతులకు 1915 జనవరి 21 న రామచంద్రారెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య కుటుంబం.
ఇద్దరు అన్నలు ~ వెంకటరమణారెడ్డి వెంకట సుందరరామిరెడ్డి , నలుగురు అక్కల తర్వాత పుట్టిన రామచంద్రారెడ్డి ఇంట్లో ఆఖరి సంతానం.తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, పుచ్చలపల్లి సుందరయ్య ప్రసిద్ధి చెందిన వాడే పుచ్చలపల్లి వెంకట సుందర రామిరెడ్డి.
రామచంద్రారెడ్డి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి వెంకటరామిరెడ్డి మరణించాడు. ఈ పరిస్థితుల్లో పెద్దక్క చిన్నవాళ్లయిన సుందరయ్యను రామచంద్రారెడ్డిని తన వెంట తిరువళ్లూరు తీసుకెళ్లి చదివించింది. ఈ విధంగా ప్రాథమిక విద్య తిరువళ్లూరులో చదివిన రామచంద్రారెడ్డి, ఆ తర్వాత ఏలూరు, రాజమండ్రి, చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
1935 లో మద్రాస్ లో వైద్యవిద్యలో ప్రవేశించి, 1940లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్నాడు.
▪️ప్రజాసేవలో వైద్యశాల
1) 1940 తర్వాత పీపుల్స్ పాలీక్లినిక్ పేరుతో వైద్యశాల స్థాపించాడు. మొదట ఒక అద్దె భవనంలో ఐదు పడకలతో ఆసుపత్రి ప్రారంభించాడు. ఇందుకు సోదరుడు పుచ్చలపల్లి వెంకటరమణారెడ్డి రూ. 5000 లతో తోడ్పాటు అందించాడు. డాక్టర్ రామచంద్రారెడ్డితో పాటుగా.... డాక్టర్ సుగుణ, డాక్టర్ సోమయ్య, కాంపౌండర్ రహీమ్ లు సిబ్బందిగా సేవలు ప్రారంభించారు .
పేదలకు ఉచిత వైద్యం ఉద్దేశంతో మొదలెట్టిన ఆసుపత్రిలో అంబులెన్స్ విధుల కోసం సైకిల్ రిక్షాను కూడా ఏర్పాటు చేశాడు.
1953 వరకు డాక్టర్ రామచంద్రారెడ్డి అన్ని తానే ఆసుపత్రి నడిపించాడు. 1953 తర్వాత పుచ్చలపల్లి సోదరుల మేనల్లుడు డాక్టర్ జెట్టి శేషారెడ్డి ఆస్పత్రి నిర్వహణలో భాగస్వామ్యం అయ్యాడు. 1967 తరువాత ఆసుపత్రి బాధ్యతలు అన్నీ తానే స్వీకరించి, రామచంద్రారెడ్డి భార్య రాజ్యలక్ష్మమ్మ అండదండలతో ముందుకు నడిపించాడు.
1967 లో ఆసుపత్రి పేరు
" డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల"గా మార్చబడింది మార్చబడింది.
కొత్త ఆసుపత్రి సముదాయాన్ని 1984లో నిర్మించారు
ప్రస్తుతం ఈ వైద్యశాల 250 పడకలతో... అధునాతన వైద్య సదుపాయాలతో... అత్యాధునిక చికిత్సలు అందించే వివిధ విభాగాల్లో నిష్ణాతులైన 60 మంది వైద్య బృందంతో , 25 మంది ట్రస్ట్ సభ్యులతో కొనసాగుతున్నది.
జనరల్ మెడిసిన్ & సర్జరీ, కార్డియాలజీ , న్యూరాలజీ , నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ మెడికల్ అండ్ సర్జికల్, ఈ ఎన్ టి ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, పల్మొనరీ మెడిసిన్, ఆప్తమాలజీ అనస్తీషియాలజీ,
పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితర విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు నేటికీ రాయితీ కొనసాగిస్తూ....ఆసుపత్రి ఖర్చుల కోసం నామమాత్రం ఫీజులు వసూలు చేస్తూ వైద్యం అందిస్తున్నారు..
MBBS డిగ్రీని పూర్తి చేసిన వారి కోసం మూడు సంవత్సరాల శిక్షణా కోర్సును కూడా ఈ ఆసుపత్రి ప్రారంభించింది
▪️ ప్రజాసేవలో కళాశాల
కావలిలో ప్రఖ్యాతి గాంచిన " విశ్వోదయ కళాశాల " విద్యాసంస్థను దొడ్ల రామచంద్రారెడ్డి స్థాపించాడు. విద్యాసంస్థ. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఇంజనీరింగ్, వైద్యం, మేనేజ్ మెంట్, ఔషధ విజ్ఞానశాస్త్రం వంటి వివిధ వైద్యసంస్థలకు మూలసంస్థగా వెలుగొందుతున్నది . దొడ్ల రామచంద్ర రెడ్డి స్థాపించిన ఈ కళాశాలకు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి సహకారం సంపూర్ణంగా ఉన్నది.
▪️తెలంగాణ ఉద్యమం - వైద్య వాలంటీర్ల శిక్షణ
1940 లో వైద్యశాల ప్రారంభించేనాటికే తన అన్న పుచ్చలపల్లి సుందరరామయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దశ దిశా నిర్దేశం చేస్తూ ప్రథమ శ్రేణి నాయకుడిగా కొనసాగుతున్నాడు . ఉద్యమ ప్రభావం రామచంద్రారెడ్డి మీద కూడా పడింది.వైద్యుడుగా ఉద్యమానికి తన వంతు సహాయ సహకారాన్ని అందివ్వడం మొదలెట్టాడు.
వైద్య సంరక్షణ వాలంటీర్ శిక్షణ ~
ఉద్యమ పోరాటాల్లో గాయపడ్డ ఉద్యమకారులకు అందివ్వడం కోసం , కొందరు ఉద్యమకారులను ఎంపిక చేసి రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో " ఆరోగ్యసేవిక " పేరుతో శిక్షణ అందివ్వడం మొదలెట్టారు . ఈ క్రమంలో ప్రతి కమ్యూనిస్టు ఉద్యమకారుడికి వైద్యం తెలిసి ఉండాలి అనే సంకల్పంతో రామచంద్రరెడ్డి తన వైద్యశాలలో రహస్యంగా కమ్యూనిస్టులకు వైద్య శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇందుకు ఎంపిక చేసిన కమ్యూనిస్టులకు వైద్య సంరక్షణ వాలంటీర్లుగా శిక్షణ అందించాడు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో....
1939 ~ 1945 మధ్య కాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం సందర్బంగా, 1942 లో స్వచ్చంద సైనిక చికిత్సల కోసం భారతదేశంలోని వైద్యులను బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన రామచంద్రారెడ్డి, తోటి డాక్టర్లైన సుగుణ సోమయ్య లతో సైనిక సేవ కోసం పేర్లను నమోదు చేసుకోవడానికి మద్రాసు వెళ్లాడు. బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు డాక్టర్ సుగుణ డాక్టర్ సోమయ్యలను మిలటరీలో పనిచేయడం కోసం అనుమతించారు. కానీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాడుగా రామచంద్ర రెడ్డి ని గుర్తించి తిరస్కరించారు..
స్వచ్ఛంద సేవ కోసం పరితపించిన రామచంద్రారెడ్డి ఇందుకు నిరాశ పడలేదు. మద్రాస్లోని స్టాన్లీ హాస్పిటల్లో చేరి విధులు నిర్వహిస్తూనే . మాస్టర్ సర్జన్గా శిక్షణ పొందాడు. మరోవైపు మద్రాసు వేదికగా జరుగుతున్న భారత జాతీయ పోరాటంలో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.
1943లో కరువు పీడిత బెంగాల్ ప్రాంతంలో సహాయక చర్యలో భాగంగా వైద్య సహాయం అందివ్వడానికి వెళ్లాడు
▪️ తెలంగాణ సాయుధ పోరాటంలో
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. సాయుధ పోరాటం ప్రారంభ దశ 1946 నుండి పోరాటంలో వైద్యుడి హోదాలోనే పాల్గొన్నాడు. రహస్యంగా అడవుల్లోకి వెళ్లి గాయపడ్డ ఉద్యమకారులకు చికిత్సను అందించేవాడు. తోడుగా తన స్నేహితుడు డాక్టర్ రామదాసును వెంట తీసుకువెళ్లేవాడు.
మరోవైపు నెల్లూరులో తన క్లినిక్ లో ఉద్యమకారులకు వైద్య వాలంటీర్ల శిక్షణను రహస్యంగా కొనసాగిస్తూనే ఉన్నాడు.ఆయినప్పటికి ఈ సమాచారం ఆనాటి ప్రభుత్వానికి తెలియడంతో ప్రభుత్వం ఆసపత్రిని నిషేధించింది. ఫలితంగా ఆసుపత్రి తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది.
▪️రామచంద్రారెడ్డి అరెస్టు
ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా
అనధికారికంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడని,
నిషేధిత కమ్యూనిస్టులకు సహకరిస్తున్నాడని, నిషేధిత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా ఉన్నాడని, తదితర నేరారోపణల కింద రామచంద్రారెడ్డిని అరెస్టు చేసి గూడూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
148, 332.307,399. 149, 395-117, 109. సెక్షన్ల క్రింద పోలీస్ కేసు రిజిస్టరు చేశారు .
కానీ రామచంద్రారెడ్డి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయాడు. ఇందుకు సహకరించిన అభియోగం మీద నలుగురు రిజర్వు పోలీస్ కానిస్టేబుల్స్ ని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది.
పోలీస్ స్టేషన్ నుండి పరారీ అయ్యి ఒక రోగికి అత్యవసర శస్త్ర చికిత్స చేస్తున్న రామచంద్రారెడ్డికి పోలీసుల సస్పెండ్ సమాచారం అందింది. విషయం తెలిసిన రామచంద్రారెడ్డి వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. ఏ పోలీస్ కానిస్టేబుల్స్ తనకు సహకరించలేదని, వాళ్ల ఉద్యోగాలు వాళ్లకి తిరిగి ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈ ఘటన రామచంద్రారెడ్డి లోని నిజాయితీకి మానవీయతకి అద్దం పడుతుంది.
▪️ కార్మికుల ~ రైతుల సమస్యల కోసం
కార్మికుల , రైతుల, రైతు కూలీల, సమస్యల కోసం ఉద్యమాలలో స్వయంగా పాల్గొన్నాడు. రిక్షా కార్మికులు, పారిశుద్ద కార్మికులు బీడీ కార్మికులు , సమస్యల కోసం సమ్మెలు నిర్వహించాడు.
▪️కళాభిమానం
రామచంద్రారెడ్డికి మొదటి నుండి కళలు అంటే ఆసక్తి. కళాకారులను ప్రోత్సహించడంలో కూడా అయన అభిరుచిలో ఒక భాగం అని చెప్పవచ్చు. "మాభూమి" నాటకం ఆ రోజుల్లో తెలంగాణాలో విపరీతంగా జనాదరణ పొందింది. ప్రజా నాట్య మండలి కళాకారుడు,రంగస్థల, సినీ నటుడు వల్లం నరసింహారావు నెల్లూరులో మాభూమి నాటకం ప్రదర్శించడం జరిగింది.ఇది రామచంద్రారెడ్డి సహకారంతోనే జరిగింది.
▪️కుటుంబం
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి .
మద్రాసు పచ్చయప్ప కాలేజిలో లీటరేచర్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన రాజ్యలక్ష్మి... రామచంద్రారెడ్డిలది
ప్రేమ వివాహం. ఆమె సామజికంగా రాజకీయంగా భర్తకు సహకరించింది. కమ్యూనిస్టు వుద్యమాలలో పాలు పంచుకున్నది. . నెల్లూరు మునిసిపల్ కౌన్సిలర్ గా రెండు పర్యాయాలు గెలిచింది. ఈ క్రమంలో రష్యా పర్యటన చేసింది. అక్కడి అభివృద్ధిని పర్యవేక్షించి...అది భారతదేశానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో సొంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. ఇండో సోవియట్ రష్యా కల్చరల్ సంస్థ సభ్యురాలిగా పని చేసింది..
1975 వరకు " రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల " ఆస్పత్రి నిర్వహణ చూడుకుంటూ అభివృద్ధిలో తోడ్పడింది .
ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు ~ ఇద్దరు కుమార్తెలు. వీరిలో
ప్రసిద్ధ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్...మెగాస్టార్ చిరంజీవి 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన డాక్టర్ మిత్ర ఇంటి పెద్ద కుమారుడు. రెండవ కుమారుడు సినీ దర్శకుడు సత్య.
రాజ్యలక్ష్మమ్మ ~ మార్చి నెల 9 వ తేదీ, 2005 లో కాల ధర్మం పొందారు.
సత్య ~ కాల ధర్మం పొందారు
▪️డా. రాం... మహాప్రస్థానంనం
హస్తవాసి ఉన్న వైద్యుడుగా, ఉద్యమకారుడుగా, రాజకీయ నాయకుడుగా, ప్రజల్లో డా. రాం అన్నగా ప్రసిద్ధి పొందిన రామచంద్రారెడ్డి 1967 లో తన 52 వ ఏట కాలధర్మం పొందారు.