03/10/2022
*దసపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం*
*టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించిన అసత్య కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా
* ప్రకటనను విడుదల చేసిన ఎంపి విజయసాయిరెడ్డి*
న్యూఢిల్లీ : దసపల్లా భూములపై టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించిన అసత్య కథనాలు, ఆరోపణలను వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మెరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ భూములకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం వెనుక నిజా నిజాలను ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. దసపల్లా భూముల వివాదంలో భారత అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దసపల్లా భూముల్లో మొత్తం 82 ఎకరాలకు సంబంధించిన వివాదంపై టీడీపీ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దసపల్లా భూముల వివాదంపై వివిధ అప్పీళ్ళ దశలు ముగిసిన అనంతరం డివిజన్ బెంచ్ ఆదేశాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. దసపల్లా హిల్స్ సర్వే నంబర్ 1197, 1196, 1028, 1027లోని భూములకు రాణి కమలా దేవిని యజమానిగా నిర్ధారిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడీంచిందని పేర్కొన్నారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 25న తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలివి.... భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఆ మేరకు దసపల్లా భూములకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని పత్రికలు... కొందరు వ్యక్తుల రాజకీయ, స్వార్ధ ప్రయోజనాలను కాపాడటం కోసం పనిగట్టుకుని దీనిపై తప్పుడు వార్తలను ప్రచురించాయి. గతంలో సర్క్యూట్ హౌస్ (ప్రభుత్వ అతిథి గృహం), తూర్పు నౌకాదళంతో పాటు ఇతర కార్యాలయాల ఏర్పాటుకు సేకరించిన దసపల్లా భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ భూములైతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. దసపల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నందువల్లే పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాటికి వచ్చిన నష్టమేమీ లేదు. వీటిని కూల్చివేస్తారంటూ చేస్తున్నది కేవలం దుష్ప్రచారమేనాని తెలిపారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇవి కేవలం కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన కుట్రపూరిత వదంతులు మాత్రమనాని చెప్పారు. దసపల్లా భూముల్ని ప్రభుత్వం 22ఏ నుంచి తొలగిస్తే సుమారు 40 ఎకరాల పరిధిలో ఉన్న 500 మంది గృహ యజమానులు, అపార్ట్ మెంట్లలో ఉంటున్న ఫ్లాట్ యజమానులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. 64 మంది ప్లాట్ల యజమానులు మాత్రమే తమ పరిధిలో ఉన్న 20 శాతం భూమిని అస్యూర్ డెవలపర్స్ కి అప్పగించారు తప్ప మిగిలిన వారెవ్వరూ ఇవ్వలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. గతంలో టీడీపీ కార్యాలయం విషయంలోనూ ఇదే జరిగింది. దసపల్లా భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వల్ల యాజమాన్య హక్కులు ఖరారయ్యే వరకు తాత్కాలిక నిర్మాణం చేపట్టాలని ఆదేశిస్తూ అప్పటి కలెక్టర్ టీడీపీకి భూమిని ఇచ్చారన్నారు. అనంతరం రాణి కమలాదేవికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీడీపీ ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. అంటే రాణి కమలాదేవితో కుమ్మక్కై టీడీపీ శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లా...? అని ప్రశ్నించారు. ఇది ఒక ప్రైవేటు ఆస్తికి సంబంధించిన అంశం. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఈ విషయం మేం కాదు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. న్యాయస్థానాల తీర్పులు కూడా మా ప్రభుత్వంలో వచ్చినవి కావు. ఇవి గత ప్రభుత్వంలో వచ్చిన తీర్పులు. పైగా, తమ తీర్పును అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు తీసుకుంటాం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పును అమలు చేయటం మినహా ప్రభుత్వం ముందు మరో మార్గం లేదన్నారు. అత్యున్నత న్యాయస్థానాలు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇస్తాం అన్నప్పటికీ కోర్టు తీర్పుల్ని మా ప్రభుత్వం అమలు చేయటానికి వీల్లేదని, వాటిని మా ప్రభుత్వం ఉల్లంఘించాలని టీడీపీ, ఎల్లో మీడియా వారు చెప్పదలచుకున్నారా? అని ప్రశ్నించారు. కాబట్టి, ఈ ప్రైవేటు భూముల వ్యవహారంలో మా ప్రభుత్వ ప్రమేయం, మాపార్టీ ప్రమేయం అన్నవి పూర్తిగా సత్యదూరమైన ఆరోపణలు మాత్రమేనాన్నారు. ప్రభుత్వం మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, పార్లమెంటరీ పార్టీ లీడర్ అయిన నాపైన, నా కుటుంబ సభ్యులపైన ఈ అంశంపై చేసిన ఆరోపణలు అసంబద్ధం. అవాస్తవం. . దసపల్లా భూములపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం వాటిని క్లియర్ చేయటం తప్ప మరో మార్గంలేని పరిస్థితిలో దసపల్లా భూములు కొందరు ప్రైవేటు వ్యక్తులకు దక్కాయని చెప్పారు. వారు ఆ భూముల్ని ఉంచుకుంటారా లేక అమ్ముకుంటారా, లేదా ఏం చేసుకుంటారన్నది పూర్తగా వారి ఇష్టమని ఆయన చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయ సారాంశమిది : దసపల్లా హిల్స్ లో మొత్తం భూమి: 83.25 ఎకరాలు (సర్వే నంబర్ 1196, 1197, 1028, 1027లో) అందులో ప్రైవేట్ లేఅవుట్స్, వుడా లేఅవుట్స్, బిల్టప్ ఏరియా, రహదారులు, ఎల్.ఆర్.ఎస్. పరిధిలో ఉన్న భూమి- సుమారు 40 ఎకరాలు. ఖాళీగా ఉన్న భూమి- సుమారు 12 ఎకరాలు. టీడీపీ కార్యాలయం, సర్క్యూట్ హౌస్, నేవీ హౌస్ తో పాటు ఇతర కార్యాలయాలకు వినియోగించిన భూమి- సుమారు 5 ఎకరాలు. మిగిలిన బిల్ట్ అప్ ఏరియా- సుమారు 12 ఎకరాలు. అస్యూర్ డెవలపర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్లాటు యజమానులుదాదాపు 15 ఎకరాల పరిధిలో ఉన్న 64 మంది అని చెప్పారు.