05/11/2019
*భూవివాదం ఏమిటి? బలయ్యింది ఎవరు?*
నిన్న పట్టాదార్ పాస్ బుక్ ఇవ్వటం లేదని ఒక వ్యక్తి అబ్దుల్లాపూర్ మెట్ మండల MRO మీద పెట్రోల్ పోసి చంపాడు.. *సురేష్ అనే వ్యక్తి.*
హత్యచేయటం తప్పే కానీ ఆవ్యక్తిని అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు పరిశీలించాలి - ఇది కొందరి వాదన. ప్రభుత్వ అధికారులకు అధికారంతో పాటు పరిమితులు ఉంటాయి,వాటిని దాటి నిర్ణయాలు తీసుకోలేరు... ఇది మరోవాదన. ఎమ్మార్వో హత్య తరువాత ఎక్కువ భావావేశం స్పందనలే ఎక్కువ .ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు లోతు చర్చ జరగాలి
అబ్దుల్లాపూర్ మెట్ అంటే అందరికి తెలియకపోవొచ్చు కానీ "రామోజీ ఫిలిం సిటి" అంటే తెలియని వారు ఉండరు. రామోజీ ఫిల్మ్ సిటి ఉన్నది అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలోనే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలు కాకముందు రామోజీ ఫిల్మ్ సిటి తో పాటు పలు థీమ్ పార్కులు ఏర్పాటు కావటం వలన అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో భూమి విలువ బాగా పెరిగింది. 2000 సంవత్సరం నాటికే రైతుల నుంచి వ్యాపారుల ఎక్కువ శాతం భూమిని కొన్నారు.
అన్నిటికన్నా ముందు గుర్తించవల్సింది "భూమి" పెట్టుబడిగా మారి రెండుదశాబ్దాలయ్యింది.భూమి వున్నవాడల్లా రైతు కాదు. రైతుల వద్ద కన్నా వ్యాపారుల వద్దే ఎక్కువ భూమి ఉంది,ముఖ్యంగా హైద్రాబాద్,ఇతర పెద్ద పట్టణాలలో భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు,కంపెనీల చేతుల్లో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ జరుగుతున్న ప్రాంతంలో భూవివాదాలు కూడా ఎక్కువే.
సురేశ్ కుటుంబానికి వివాదాస్పద భూమి ఎలా వొచ్చింది?
భూచట్టాలు ఎలాఉన్నాయి ?
హైదరాబాద్ సంస్థానంలో భూమి యాజమానులు ఎవరు,భూమిని ఎవరు సాగు చేస్తున్నారు, రైతులు, జమీందారులెంత మంది వంటి వివరాలు సేకరించడానికి1936లో భూముల సర్వే జరిగింది. ఈ రికార్డును సేత్వార్ చేశారు. ఇదే భూరికార్డులకు మూలం.
చట్టప్రకారం ప్రతి 30 సంవత్సరాలకు భూముల రీ సర్వే జరగాలి కానీ అప్పటి ప్రభుత్వం రీసర్వే చెయ్యకుండా "కాస్రా యాక్ట్"ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మూడేళ్లు భూములు ఎవరి సాగులో ఉంటే వారినే యాజమానులుగా గుర్తిస్తూ 1955/1956లో ‘చేసాల పహాణి ’ తయారు చేశారు. పహాణి ఆంధ్రప్రాంతంలోని "అడంగల్ " వంటి రికార్డ్ .
ROR (రికార్డ్ ఆఫ్ రైట్)-1971 యాక్ట్ ప్రకారం.80 దశకంలో ఆర్వోఆర్ రిజిస్టర్ను ప్రభుత్వం సిద్ధం చేసింది.ఈ రికార్డులో
1A (గ్రామ లెక్కలు), 1B (పట్టాదారు వివరాలు), 1C (ప్రభుత్వ భూముల వివరాలు)లను పొందుపరిచారు.
1B పట్టాదారు వివరాలలో చాలావరకు గందరగోళ,అసమగ్ర వివరాలు ఉన్నాయి. ఎక్కువ వివాదాలకు ఈ 1B రికార్డు వివరాలే కారణం. వివాదాలు పరిష్కారం ,రికార్డుల ఆధునీకరణలో 1B రికార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
1B లో పట్టాదారు మరియు సాగుదారు కాలమ్లలో ఒకే పేరు ఉంటే ఇబ్బంది లేదు కానీ వేరు వేరు పేర్లు ఉన్న భూములకు సంబంధించి ఎక్కువ వివాదాలు జరుగుతున్నాయి. వీటిని పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో 2016లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేను చెపట్టి కొత్త పాస్ బుక్కులు ఇచ్చారు.
సురేశ్ కుమార్ భూ సమస్య
1988లో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాచారం గ్రామంలో రాజా ఆనందరావు అనే వ్యక్తి నుంచి 36 మంది రైతులు 137 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.ఈ 36మంది రైతులలో సురేష్ తాత ఒకరు. రాజా ఆనందరావుకు ఆ భూమి ఎలా దక్కింది అన్నదానికి నిర్దిష్ట వివరాలు లేవు కానీ అబ్దుల్లాపూర్ మెట్ అనేది జాగీర్ధార్ గ్రామం,ఇక్కడ ఇనాం భూములు అధికం. నిజాం లేక హైద్రాబాద్ సంస్థానం కు చెందిన మరొక పాలకుడి నుంచి రాజా ఆనందరావు భూమి తీసుకొని స్థానిక రైతులకు కౌలుకు ఇచ్చిఉండవొచ్చు. అనేక మంది మరాఠాలు,గుజరాతీయులు నిజాం హయాంలో ఇలా భూములను తీసుకొని రైతులకు కౌలుకు ఇచ్చేవారు.
రాజా ఆనందరావు నుంచి 36 మంది రైతులు నిజంగా కొన్నారా? లేక ఆయన ఈ భూములు ఎవరికీ అమ్మకుండానే మహారాష్ట్రకు తిరిగివెళ్ళారా, ఆయన వారసులు ఉన్నారా? ఏ వివరాలు లేవు. కానీ గతంలో ప్రభుత్వం 5 ఎకరాలకు లోపు ఉన్న "సాదా బైనామా"ల అంటే తెల్ల పేపర్ మీద రాసుకున్న అగ్రిమెంట్ల కు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఇలాంటి అమ్మకాలు పహాణిలోకి ఎక్కటం అరుదు. అంటే పట్టాదారు మార్పు అడంగల్లోకి ఎక్కలేదు. భూమికి సంబంధించి పహాణి ప్రధాన రికార్డు.
సురేశ్ కుమార్ కుటుంబం వారి భూమిని సాగు చేసినట్లు లేదు. 2000 తరువాత ఆప్రాంతంలో భూమి విలువ పెరగటం,ముఖ్యంగా వైస్సార్ హయాంలో రింగ్ రోడ్ ప్రతిపాదనతో సురేష్ కుమార్ భూమి మీద హక్కుల కోసం ప్రయత్నం చేశాడు .
2004లో ఆ భూముల మీద హక్కు ఉందని అదే బాచారం గ్రామానికి చెందిన హబీబ్,షఫీక్ లు రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. 2012లో RDO విచారణ జరిపి హబీబ్, షఫీక్ లకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సురేష్ 2013లో జాయింట్ కలెక్టర్(భూ వివాదాల కోర్ట్) కు ఫిర్యాదు చేసాడు. జేసీ విచారణ చేసి సురేష్ కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చాడు. అక్కడితో సమస్య ముగిసిపోయిందనుకుంటే 2016 సమగ్ర భూసర్వే మొదలు కావటంతో సురేష్ పాత రికార్డులు తీసుకొని తన పేరుతో పాస్ బుక్స్ ఇవ్వాలని రెవిన్యూ అధికారుల వద్దకు వెళ్ళాడు. రెవెన్యూ అధికారులు రికార్డ్స్ పరిశీలించి సురేష్ కు పాస్ బుక్స్ ఇవ్వటానికి సిద్ధపడుతున్న సమయంలో హబీబ్ అది తనకు చెందిన భూమి అని సురేష్ కు పాస్ బుక్స్ ఇవొద్దని కోర్టుకు వెళ్ళాడు.
రెవెన్యూ అధికారులు తనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారని సురేష్ తన భూమిని అమ్మకానికి పెట్టి ఒక రాజకీయనాయకుడి వద్ద అడ్వాన్స్ తీసుకున్నాడు. హబీబ్ హై కోర్టుకు వెళ్లటంతో అది తేలేవరకు పాస్ బుక్స్ ఇవ్వటం కుదరదని MRO చెప్పారు.
MRO ను చంపటానికి సురేష్ ను ఉసికొల్పిన అంశాలు ఏమిటి?
రెండు ఎకరాల భూమి,ఎకరం కోటి కోటిన్నర ఉందని అనుకున్నా మూడు కోట్ల ఆస్తి,దాని కోసం MRO ను చంపే ధైర్యం ఎవరైనా చేస్తారా?
ఆత్మహత్య నాటకం వికటించింది అనుకోవటానికి అవకాశంలేదు. సురేష్ MRO ను హత్యచేసే ఉద్దేశ్యంతోనే ఆవిడ ఛాంబర్ లోపలి వెళ్లి పెట్రోలుపోసి చంపేశాడు. ఉద్దేశ్యపూర్వక హత్య కాకవుంటే పెట్రోల్ పోసిన తరువాత నిప్పు పెట్టేటప్పుడన్నఅతను నిర్ణయాన్ని మార్చుకునేవాడు. సురేష్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు అనేది అసంబద్ధం ..MRO ను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో సురేష్ కు మంటలు అంటుకొని ఉండవొచ్చు. డోర్ మూసుకొని పోవటంతో అతను బయటకు రావటానికి అవకాశం లేకుండాపోయింది. డ్రైవర్ డోర్ తీసిన తరువాత సురేష్ పరిగెత్తుకుంటూ మంటలు అంటుకున్న షర్ట్ ను చించేసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
ఈ హత్యలో సురేష్ కనిపిస్తున్న పాత్ర అయితే తెరవెనుక పాత్రధారులు ఎవరైనా ఉన్నారేమో విచారణచేయాలి. MRO హత్య లాంటిసంఘటనల తరువాత ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న భూవివాదాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుందన్న ఆలోచనతో ఎవరైనా పెద్దస్థాయి వ్యాపారి లేక రాజకీయనాయకుడు సురేష్ ను ఉసికొల్పడా? చాలా లోతుగా విచారణ జరిపించాలి.
అవినీతి ఎక్కువగా జరిగే రెవిన్యూ శాఖ అధికారుల మీద ప్రజలకు ఎక్కువ కోపం ఉంటుంది. కానీ ఇలాంటి సంఘటనలను అదే కోణంలో చూడకూడదు. ఈ చర్చంతా పక్కనపెట్టి సురేష్ పట్ల సానుభూతి చూపాలనుకుంటే పదిమందిలో కనీసం ఐదు మందికి ఎవరినో ఒకరిని చంపటానికి కారణాలు ఉంటాయి. హత్య చెయ్యటం సమర్ధనీయం కాదు,హంతకుడిని సానుభూతికోణంలో చూడటం కూడా వాంఛనీయం కాదు.
ఏదేమైనా ఈ విధంగా హత్య చేయడం అనేది సభ్యసమాజంలో సమర్థనీయం కాదు...