02/12/2022
(స్పెక్ట్రా రియల్ దందా కథనం 1) బాక్స్లో వేయాలి...
స్పెక్ట్రా రియల్ దందా (headline)
దినదినం పెరుగుతున్న స్పెక్ట్రా మోసాలు
వేలాది కస్టమర్లకు మొండిచెయ్యి
మార్కెట్ టీంను అడ్డుపెట్టుకుని మోసాలు
ఏ వెంచర్లోనూ డెవలప్ మెంట్ ఉండదు..
మాటలు మాత్రం కోటలు దాటుతాయి..
చేతలు మాత్రం గేటు కూడా దాటవ్..
పనులు వేగవంతమంటూ మాయమాటలు
మాటలతోనే బురిడీ కొట్టిస్తున్న వైనం
ఆలస్యంగా వెలుగులోకి మోసాలు
రియల్దందాపై వరుస కథనాలు
వార్తాలోకం ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్, డిసెంబర్ 2:
స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ మోసాలు మాములుగా లేవు. పేదలను దారుణాతిదారుణంగా ముంచేస్తున్నారు. యాదగిరిగుట్ట, షాద్ నగర్ లో రియల్ వెంచర్లు వేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను విక్రయించారు. ఆర్థిక స్థోమత లేని వారికి ఈఎంఐల రూపంలో వల విసిరింది యాజమాన్యం. తమ పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు కష్టపడి... అర్థాకలితో జీవితాన్ని గడుపుతూ రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బును నెల నెలా ఈఎంఐల రూపంలో స్పెక్ట్రా మార్కెట్ టీమ్ సభ్యులకు తూ.చ.క్రమం తప్పకుండా డబ్బులు కట్టారు. తీరా మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత కస్టమర్లకు చూపించిన వెంచర్ లోని ప్లాట్ కాకుండా వేరే ప్లాట్ను అంటగడుతున్నారు. ఇదేంటని అడిగితే మళ్లీ మాయమాటలు చెబుతున్నారు స్పెక్ట్రా మార్కెట్ టీమ్ సభ్యులు. ఆరుగాలం కష్టించి సంపాదించిన డబ్బును అమాంతం బొక్కేసి ఎగనామం పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రేపు మాపు అంటూ రోజుల తరబడి, నెలల తరబడి మార్కెట్ టీమ్ సభ్యులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు.
స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసం తల్చుకుని కొందరు ఆఫీసుకు వెళ్లి లబోదిబోమంటూ మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బుతో అంగబలం, అర్థబలం సమకూర్చుకున్న స్పెక్ట్రా యాజమాన్యం తమను నానా బూతులు తిడుతోందని ఆవేదన చెందుతున్నారు కస్టమర్లు. తమ కనుసనల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడుతోందని వారంటున్నారు.
అటు రాజకీయనాయకులు, ఇటు ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిరుపేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలకు తూట్లు పొడుస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, తమకు అన్యాయం జరిగిందని ఎక్కడో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని అమాయకులు, స్పెక్ట్రా రియల్ మోసాలకు గురై విలవిల్లాడిపోతున్నారు. తాము కష్టాలు పడినా సరే, తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని, రేయింబవళ్లు శ్రమటోడ్చి సంపాదించిన ప్రతిరూపాయిని స్పెక్ట్రా వెంచర్లోని ప్లాట్ కోసం ఈఎంఐలు కట్టామని, మూడేళ్లు పూర్తిగా డబ్బులు కట్టిన తర్వాత తమకు చూపించిన ప్లాట్ ఇవ్వకుండా, ఆ ప్లాట్ వేరే వాళ్లకు అమ్ముకుని తమకు మొండిచేయి చూపుతున్నారని ఆందోళన చెందుతున్నారు కస్టమర్లు.
మరికొందరు తమకు నచ్చిన ప్లాట్ ఇవ్వకుండా వేరే ప్లాట్లు ఇవ్వడం అన్యాయమని, అడిగితే పట్టించుకునేనాధుడే లేడు. తొలుత కస్టమరే దేవుడంటూ, అన్ని వసతులు కల్పించి, నమ్మకం కలిగేలా తేనెపూసిన మాటలతో మాయమాటలు చెప్పి, ప్లాట్లను అంటగట్టారని కస్టమర్లు లబోదిబోమంటున్నారు.
ఇంకొందరు తమకు నచ్చిన ప్లాట్ ఇవ్వకపోవడంతో తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే దౌర్జన్యాలకు దిగుతున్నారని మదనపడుతున్నారు. రేపు ఇస్తాం..ఎల్లుండి ఇస్తామంటూ కాలం వెల్లదీస్తూ ఆరు నెలలు, ఏడాది వరకు తప్పించుకు తిరుగుతున్నారు. స్పెక్ట్రా మార్కెట్ టీమ్ సభ్యులను పట్టుకుని ప్లాట్ల సమాచారం తెలుసుకోవడానికి మళ్లీ వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక అదే పనిగా వెంటబడి తిరిగే వారికి కొన్ని చెల్లని చెక్కులు రాసి ఇస్తున్నారు. మరికొందరు కస్టమర్లు కాళ్లకు చెప్పులు అరిగేలా స్పెక్ట్రా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు స్పెక్ట్రా యాజమాన్యం. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్లుగా యాజమాన్యం ప్రవర్తిస్తోందని ఆవేదనభరిత గద్గద స్వరంతో చెప్పుకోవడం కస్టమర్ల వంతయింది.
అసలు స్పెక్ట్రా ఓనర్ ఎవరు ?
సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పటికీ, అసలు స్పెక్ట్రా ఓనరు ఎవరు? ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. తెలియనివ్వరు కూడా..! అంతా మార్కెటింగ్ టీమ్ మాయజాలమే. మాటలే పెట్టుబడిగా, అమాయకులను నిలువెల్లా మోసం చేస్తూ, లాభాల పంట పండిస్తున్నారు. భూమిపై పెట్టుబడి పెట్టండి.. బంగారు భవిష్యత్ మీ పిల్లలకు ఇవ్వండి అంటూ స్లోగన్లతో అందమైన రంగు రంగుల బ్రోచర్లు వేసి పేదలను బురిడీ కొట్టించడంలో మార్కెటింగ్ టీమ్ సభ్యులది అందె వేసిన చెయ్యి. తమకు వచ్చిన విద్యకు పదును పెట్టి, తేనెపూసిన మాటల కత్తితో పేదల బతుకులను బలి తీసుకుంటున్నారు. నిరుపేదలకు, పేదలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను కొనుగోలు చేసేలా ఉసిగొల్పుతున్నారు.
పట్టణాలు, పల్లెల్లోకి వారిని పంపించి కమీషన్లు ఇస్తామని చెప్పి పేద, మధ్య తరగతి ప్రజలను దారుణంగా మోసం చేశారు. తొలుత ప్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఒక టీం వస్తుంది. ఈఎంఐ డబ్బులు కట్టించుకునేటప్పుడు మరో టీం వస్తుంది. తీరా ప్లాట్ అలాట్ మ్మెంట్ చేసేటప్పుడు ఇంకో టీమ్ రంగంలోకి దిగుతోంది. అసలు యాజమాన్యం ఎవరనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంటుంది. ఆ రహస్యాన్ని ఛేదించడం సామాన్య నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు సాధ్యం కాని పరిస్థితి.
సినిమావాళ్లను తలతన్నేలా ఒకరికి మించి మరొకరు నటించి, కాదు కాదు జీవించి కస్టమర్లను తికమక పెట్టి, ఒట్టి చేతులతో వెనక్కి పంపించడం స్పెక్ట్రా యాజమాన్యానికి వెన్నెతో పెట్టిన విద్య. ఎంతలా అంటే వీరికి హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశమిస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ. స్పెక్ట్రా లీలలు అన్నీ ఇన్నీ కాదయ్యా.. ఎందెందు చూసినా అందందె కలదు..
స్పెక్ట్రా ఓనర్ ఎవరో కనిపించరు..మాట్లాడరు..కస్టమర్లు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసినా కనిపించడు. పట్టించుకోడు. అతని చుట్టూ విచిత్రమైన, అంతుచిక్కని వలయం మాదిరిగా ఏర్పాటు చేసుకుని యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతూ నిరుపేద ప్రజల సొమ్మును కాజేస్తున్నారు.
వెంచర్ కు అప్రూవల్ రాకముందే ప్లాట్ల విక్రయం
ప్రజలను మోసం చేయడంలో స్పెక్ట్రా యాజమాన్యంకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. యాదగిరిగుట్టలో స్పెక్ట్రా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. మొదట చెప్పిన వెంచర్ ఒకచోట...ప్లాట్ కేటాయించే సమయంలో చూపించేది మరొక చోట. ఇదేంటని అడిగితే కస్టమర్లు బుక్ చేసుకున్న వెంచర్ కు అప్రూవల్ రాలేదని, అసలు అది వస్తదో రాదో కూడా తెలియదని చెబుతున్నారు. కొందరు తమ ఖర్మ అనుకుని సర్దుకుపోతుంటే, మరికొందరు డబ్బులు ఇవ్వాలని అడిగితే కాలయాపన చేస్తూ స్పెక్ట్రా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారు. వీరి మోసాలపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారిని మేనేజ్ చేసుకుంటూ మళ్లీ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరి ఆగడాలు అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పేదలు నిరుపేదలుగా, మధ్య తరగతి ప్రజలు పేదలుగా మారి రోడ్డున పడే పరిస్థితి తలెత్తక ముందే జాగ్రత్త వహించడం ఎంతైన అవసరం.
(రేపటి సంచికలో స్పెక్ట్రా రియల్ దందా కథనం 2 ఉంటది..)